: కొంప ముంచిన నోట్ 7ఎస్... శాంసంగ్ కు లక్ష కోట్లకు పైగా నష్టం

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా విడుదల చేసిన 'నోట్ 7ఎస్' ఫోన్ చివరకు శాంసంగ్ కొంప ముంచుతోంది. దీని దెబ్బకు ఆ సంస్థ భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఆ నష్టం దాదాపు రూ. 1.17 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. నోట్ 7ఎస్ ఫోన్ పేలినట్లు నిన్న వార్తలు రావడంతో శాంసంగ్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆ మోడల్ మొబైల్ విక్రయాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని ప్రకటించింది. మరోవైపు, అమెరికా వ్యాప్తంగా ఈ మోడల్ ను నిషేధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో కూడా దాదాపు 25 లక్షల నోట్ 7ఎస్ లను శాంసంగ్ రీకాల్ చేసింది. వాటిని రీప్లేస్ చేసిన తర్వాత కూడా... పేలినట్టు మళ్లీ వార్తలు వచ్చాయి. శాంసంగ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 15.6 లక్షల కోట్లు. అయితే, ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ విక్రయాలు కొంతమేర పడిపోయాయి. మరోవైపు, నోట్ 7ఎస్ తో నష్టాలు రావడంతో... కంపెనీ విలువ కూడా తగ్గపోయే అవకాశం కనిపిస్తోంది.

More Telugu News