: పాకిస్థాన్‌తో ప్రపంచానికి పెనుముప్పు.. ఐక్యరాజ్య సమితికి వివరించిన భారత్

పాకిస్థాన్‌తో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి వివరించింది. సోమవారం భారత దౌత్యవేత్త వెంకటేశ్ వర్మ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు అణ్వాయుధాలపై నియంత్రణ లేదని, జిహాదీ గ్రూపులతో సన్నిహిత సంబంధాల కారణంగా అవి వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే కనుక జరిగితే ప్రపంచానికే పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. నిరాయుధీకరణపై పాక్ దౌత్యవేత్త తెహ్మినా జంజువా యూఎన్‌లో చేసిన వ్యాఖ్యలకు స్పందించిన వెంకటేశ్ వర్మ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వల్ల శాంతి, సుస్థిరత ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ఐరాస ‘మొదటి కమిటీ’లో మాట్లాడిన పాక్ దౌత్యవేత్త జంజువా జమ్ము కశ్మీర్ వివాదంపై మాట్లాడారు. నిజానికి ఈ కమిటీలో నిరాయుధీకరణ, అణ్వస్త్రాలకు సంబంధించిన అంశాల గురించి మాత్రమే మాట్లాడాలి. ముందుగా తయారు చేసుకున్న ప్రసంగంలో జమ్ము కశ్మీర్ అంశం లేకున్నా జుంజువా మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలకు బదులిస్తూ వెంకటేశ్ వర్మ భారత్ ఆందోళనను ఐరాసకు తెలిపారు.

More Telugu News