: బంగారంలాంటి అవకాశం వస్తే మళ్లీ గాయపడ్డ గంభీర్

టీమిండియా ఓపెనర్ గౌతమ్ గంభీర్ బంగారం లాంటి అవకాశాన్ని వినియోగించుకోవడంలో తడబడ్డాడు. గతంలో గాయం, ఫాం లేమితో జట్టులో చోటుకోల్పోయిన గంభీర్... ఇప్పుడు కివీస్ తో జరుగుతున్న మూడో టెస్టు ద్వారా పునఃప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ లో 29 పరుగులు చేసి జోరుమీదున్న దశలో బంతిని అంచనా వేయడంలో తడబడ్డ గంభీర్ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. రెండో ఇన్నింగ్స్ లో సత్తాచాటడం ద్వారా టీమిండియాలో స్థానం పదిలం చేసుకోవచ్చని భావించిన గంభీర్ వస్తూనే ఫోర్ బాది దూకుడు ప్రదర్శించాడు. బోల్ట్ సంధించిన మూడో ఓవర్ ఐదో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన గంభీర్, అనవసరంగా రెండో పరుగుకు ప్రయత్నించి, వికెట్లను చేరే క్రమంలో డైవ్ చేశాడు. దీంతో గతంలో దేని కారణంగా అయితే జట్టుకు దూరమయ్యాడో, అదే గాయం తిరగబెట్టింది. కుడిచేతి భుజం గాయపడింది. దీంతో ఫిజియోను పిలిచి గంభీర్ కొంత ఉపశమనానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా పుజారాను రంగంలోకి దించింది.

More Telugu News