: లాభాల్లో ప్రారంభమై ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్!

సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 140 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్న సెన్సెక్స్, ఆపై అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని కిందకు దిగి వచ్చింది. మధ్యాహ్నం తరువాత యూరప్ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెరగనీయలేదని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానించారు. మరోవైపు నిఫ్టీ సూచిక 8,700 పాయింట్ల స్థాయి వద్ద మద్దతును నిలుపుకోవడం గమనార్హం. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 21.20 పాయింట్లు పెరిగి 0.08 శాతం లాభంతో 28,082.34 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 11.20 పాయింట్లు పెరిగి 0.13 శాతం లాభంతో 8,708.80 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.20 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.25 శాతం లాభపడింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 28 కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్, ఏసీసీ, ఏషియన్ పెయింట్స్, సిప్లా, హిందాల్కో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, బీపీసీఎల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 3,016 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,700 కంపెనీలు లాభాలను, 1,182 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,13,49,915 కోట్లకు చేరింది.

More Telugu News