: చైనాకు వ్యతిరేకంగా బెలూచిస్థాన్ వాసుల నిరసన

తమకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ, ఇప్పటికే ఉద్యమ బాట పట్టిన బెలూచిస్థాన్ వాసులు నేడు చైనాకు వ్యతిరేకంగానూ నిరసనలు చేపట్టి, ఆ దేశ వైఖరిపట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ డిమాండ్ ను పట్టించుకోకుండా, తమ భూభాగం నుంచి చైనా ఎకనామిక్ కారిడార్ ను నిర్మిస్తుండటాన్ని వ్యతిరేకిస్తున్న క్వెట్టా వాసులు, ఈ ఉదయం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రోడ్లపై దిష్టి బొమ్మలను దహనం చేస్తూ, రహదారిని బ్లాక్ చేశారు. పాక్ అండతో బెలూచిస్థాన్ ప్రాంతంలో చైనా జోక్యం పెరిగిపోతోందని వారు ఆరోపించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఝలక్ ఇచ్చారు. కాగా, క్వెట్టా ప్రాంతం చైనా, పాక్ చేపట్టిన ఎకనామిక్ కారిడార్ లో కీలక ప్రాంతమన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంత ప్రజల సహకారం లేకుండా కారిడార్ నిర్వహణ సులభం కాదన్నది చైనా నిపుణుల ఆలోచన. ఇక క్వెట్టాలోని ప్రజలను చైనా ఎలా శాంతింపజేస్తుందన్నది వేచి చూడాలి.

More Telugu News