: ఫేస్‌బుక్‌ను ఆకర్షించిన మణిపురి కుర్రాడి మొబైల్ యాప్.. అభివృద్ధికి 40 వేల డాలర్లు ఇస్తున్నట్టు ప్రకటన

సింగపూర్‌లో ఉంటున్న మణిపురి యువకుడు తయారుచేసిన మొబైల్ యాప్ అభివృద్ధికి 40వేల డాలర్లు ఇస్తున్నట్టు ఫేస్‌బుక్ ప్రకటించింది. మోనిష్ కరమ్(35) ‘జాబ్‌సెంజ్’ అనే యాప్‌ను రూపొందించాడు. ఈ మొబైల్ అప్లికేషన్‌ను మరింత అభివృద్ధి పరిచేందుకు ఫేస్‌బుక్ 40వేల డాలర్లు ఇస్తున్నట్టు ప్రకటించినట్టు మోనిష్ తెలిపాడు. ఈ యాప్‌ను మార్కెటింగ్, అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సెర్వర్ ఇన్ఫ్రాస్టక్చర్‌లో ఉపయోగిస్తున్నట్టు చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ స్టార్టప్స్‌ను ఎంపిక చేసి చేయూత అందిస్తున్న ఫేస్‌బుక్ ఈసారి జాబ్‌సెంజ్‌ను ఎంపిక చేసింది. ఫేస్‌బుక్ నిబంధనలకు అనుగుణంగా తాను రూపొందించిన యాప్ ఉండడం, ఇప్పటికే ఈ యాప్‌ను ఇండియాలో రికార్డు స్థాయిలో మొబైల్ యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవడంతో పరిశీలన కోసం ఫేస్‌బుక్‌కు పంపించినట్టు కరమ్ తెలిపాడు. ఉద్యోగాలు వెతుక్కునే వారికి, వివిధ భాషల్లో రెజ్యూమెలను తయారుచేసుకునే వారికి, అలాగే ఉద్యోగాలు, పోటీపరీక్షలకు హాజరయ్యే వారికి కావాల్సిన మొత్తం సమాచారాన్ని ఇందులో పొందుపర్చాడు. అంతేకాదు, మార్కెట్ ప్లేస్ సహా కోచింగ్ సెంటర్లు, ఎడ్యుకేటర్లు, తమ కోర్సులను విక్రయించాలనుకునే వారికి, తమ వద్ద ఉన్న సమాచారాన్ని షేర్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతో బాగా పనికి వస్తుందని కరమ్ వివరించాడు.

More Telugu News