: స్కూల్లో అభ్యంతరకర పాఠాల బోధన.. కేసు నమోదు

విద్యార్థులకు అభ్యంతరకర పాఠాలు బోధిస్తున్న పాఠశాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేరళలోని ఎర్నాకులం తమ్మనమ్‌లో ‘ద పీస్ ఇంటర్నేషనల్ స్కూల్’ ఉంది. వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరు రచించిన పాఠాలను ఈ స్కూల్లో విద్యార్థులకు బోధిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్, స్కూల్ నిర్వాహకుడు, మరో ముగ్గురు ట్రస్టీలపై కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం డీఈవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థులకు బోధిస్తున్న పాఠాల్లో అభ్యంతరకరమైన అంశాలు ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. ముంబైకి చెందిన ఇస్లామిక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఈ పాఠాలను ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరినట్టు భావిస్తున్న అబ్దుల్ రషీద్ ఈ పాఠశాలలో పీఆర్వోగా పనిచేసేవాడని, అతడి భార్య మరియం ప్రస్తుతం ఇదే పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నట్టు పోలీసులు వివరించారు. వివాదాస్పద పాఠాల బోధనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News