: నక్సల్స్‌కు పోలీసుల రక్తదానం.. మానవత్వం చాటుకున్న విశాఖ కానిస్టేబుళ్లు

ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడి తమ చేతికి చిక్కిన ఇద్దరు నక్సల్స్‌కు పోలీసులు రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వారు కోలుకునేంత వరకు సపర్యలు చేశారు. విశాఖపట్నం జిల్లా స్పెషల్ పార్టీ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఈ నెల 6న పెదపాడు-కుంకుంపూడి అటవీప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అంబ్రి, గెమ్మెల నర్సింగ్ అనే ఇద్దరు మావోలు పోలీసుల చేతికి చిక్కారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. అయితే వారికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, ఇందుకు రక్తం అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని ఎస్పీ రాహుల్‌దేవ్‌కు తెలియజేశారు. స్పందించిన ఆయన విషయాన్ని స్పెషల్ పార్టీ పోలీసులకు చెప్పడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి రక్తదానం చేసి నక్సల్స్ ప్రాణాలు కాపాడారు. మావోలకు జరిగిన ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని ఎస్పీ తెలిపారు. రక్తదానం చేసిన కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు.

More Telugu News