: కరుణానిధి హాస్పిటల్ లో ఉన్నప్పుడు చేయని ఏర్పాట్లు ఇప్పుడు చేయాలా?: 'డీఎంకే'పై వైగో ఫైర్

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చికిత్స పొందుతున్న అపోలో హాస్పిటల్ కు ఎండీఎంకే అధినేత వైగో ఈ రోజు వెళ్లారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, జయలలిత ఆరోగ్యం త్వరలోనే మెరుగుపడుతుందనే నమ్మకం తనకుందని తెలిపారు. జయకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని... లక్షలాది ఏఐఏడీఎంకే కార్యకర్తల ఆందోళనలన్నీ త్వరలోనే మటుమాయమవుతాయని చెప్పారు. జయకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో కూడా తాను మాట్లాడానని తెలిపారు. కావేరి జలాల విషయంలో రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా జయ తన గొప్పదనాన్ని చాటుకున్నారని కొనియాడారు. జయలలిత హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారని తెలిసినప్పుడు తాను షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆ తర్వాత, హాస్పిటల్ నుంచి తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగరరావు దగ్గరకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు వైగో. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది కేవలం స్నేహపూర్వక భేటీ మాత్రమే అని చెప్పారు. పాత ఙ్ఞాపకాలను తాము నెమరువేసుకున్నామని... రాజకీయాల గురించి మాట్లాడలేదని తెలిపారు. జయ కోలుకునేంత వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలంటూ డీఎంకే నేత స్టాలిన్ చేసిన డిమాండ్ పై స్పందిస్తూ, వైగో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 2009లో కరుణానిధి అస్వస్థతకు గురైనప్పుడు ఆయన దాదాపు 45 రోజుల పాటు హాస్పిటల్ లోనే ఉన్నారని... అప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించారా? అంటూ ప్రశ్నించారు.

More Telugu News