: రెండు కొత్త బంతులతో ఆడినా ఫలితం సున్నా...తొలిరోజు ఆధిపత్యం టీమిండియాదే!

ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో క్రికెట్ మజాను టీమిండియా ఆటగాళ్లు రుచిచూపించారు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఫస్ట్ డే ఆటను టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. మురళీ విజయ్ (10), గౌతం గంభీర్ (29) ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలిరెండు టెస్టులు గెలిచిన నేపథ్యంలో ఈ టెస్టు గెలుచుకోవాలని ఆరాటం టీమిండియా ఓపెనర్లలో కనిపించింది. దీంతో సుదీర్ఘ విరామం తరువాత పునఃప్రవేశం చేసిన గంభీర్ మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. అయితే క్రీజులో కుదరుకునేలోపే వీరిద్దరూ పెవిలియన్ చేరారు. అనంతరం వచ్చిన డిపెండబుల్ ఛటేశ్వర్ పుజారా (41) నిలదొక్కుకుని కీలక సమయంలో అవుటయ్యాడు. దీంతో కేవలం 100 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, డిపెండబుల్ అజింక్యా రహానే జతకలిసి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆటను ఆస్వాదిస్తూ బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ దశలో వీరిద్దరి జోడీని విడదీసేందుకు రెండో కొత్త బంతిని తీసుకుని బౌలింగ్ కు దిగారు. అయినప్పటికీ ఎలాంటి తొట్రుపాటుకు లోనుకాకుండా వీరిద్దరూ టెస్టు క్రికెట్ మజాను సగటు ప్రేక్షకుడికి రుచిచూపిస్తూ, బౌలర్లను విసిగిస్తున్నారు. దీంతో టీమిండియా బ్యాటింగ్ తీరుతో స్కోరు బోర్డు నెమ్మదిగా నత్తనడకన సాగుతోంది. ఈ క్రమంలో కోహ్లీ (103) సెంచరీ చేయగా, రహానే (79) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో టీమిండియా తొలిరోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్, శాంటనర్, పటేల్ చెరో వికెట్ తీశారు.

More Telugu News