: సిరియా నగరంపై దాడుల నేపథ్యంలో... ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం
ఐక్యరాజ్యసమితిలో అత్యంత కీలకమైన భద్రతామండలి ఈ రోజు అత్యవసరంగా సమావేశమవుతోంది. సిరియాలోని అలెప్పో నగరంలో కొనసాగుతున్న వైమానిక దాడులను నిలువరించే క్రమంలో ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే అమెరికా, రష్యా వైమానిక దాడులతో అలెప్పో నగరం అతలాకుతలం అయింది. అలెప్పోలో 990 మంది సంఘవిద్రోహులను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న వైమానిక దాడుల వల్ల అక్కడున్న 2,75,000 మంది అమాయకులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని ఐక్యరాజ్యసమితి సిరియా ప్రత్యేక రాయబారి స్టఫాన్ డీ మిస్తుర తెలిపారు. నగరంలో నెలకొన్న ఘర్షణ పరిస్థితిని వెంటనే రూపుమాపాల్సిన అవసరం ఉందని నిన్ననే ఆయన ఐక్యరాజ్యసమితికి విన్నవించారు. అలెప్పోపై జరుగుతున్న దాడులు సరైనవి కాదని ఆయన తెలిపారు. మరోవైపు, వైమానిక దాడులను ఆపేయాలనే ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారని భావిస్తున్నప్పటికీ... దాడులు ఆపడానికి రష్యా అంగీకరించే పరిస్థితిలో లేదని మరో వాదన వినిపిస్తోంది.