: అమెరికాలో 4,300 విమాన సర్వీసులు రద్దు... వణికిస్తున్న 'మాథ్యూ' తుపాను

అమెరికాను 'మాథ్యూ' హరికేన్ వణికిస్తోంది. కరీబియన్ దీవుల్లోని హైతీలో పెను విధ్వంసం సృష్టించిన హరికేన్, ఇప్పుడు కాస్త బలహీన పడి అమెరికాలో అడుగు పెడుతోంది. అత్యంతప్రమాకర నాలుగో కేటగిరీ వేగంతో వీచిన గాలులతో హైతీలో 478 మందిని బలిగొంది. అక్కడ తీవ్రత తగ్గించుకుని, మూడో కేటగిరీ తీవ్రత గాలులతో అమెరికాలో అడుగుపెడుతోందని వార్తలు వెలువడడంతో అమెరికన్లు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎమర్జెన్సీని ప్రకటించారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండగా, ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో 5.50 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో, సుమారు 4,300 విమాన సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. మరికొన్ని గంటల్లో 'మాథ్యూ' హరికేన్ ఫ్లోరిడాను తాకనుందని అమెరికా వాతావరణ కేంద్రం ప్రకటించగా, ఇప్పటికే ఫ్లోరిడా తూర్పుతీరంలో బలమైన గాలులు వీస్తున్నాయి. 'మాథ్యూ' కారణంగా జార్జియా, దక్షిణ కరోలినాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ప్రకటించారు.

More Telugu News