: జయలలిత అనారోగ్య పరిస్థితులను రాజకీయం చేయదలచుకోలేదు: డీఎంకే నేత స్టాలిన్

తమిళనాడు సీఎం జయలలిత అనారోగ్య పరిస్థితులను తాము రాజకీయం చేయదలచుకోలేదని ప్రతిపక్ష నేత, డీఎంకే పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్నారు. కావేరి నిర్వహణ బోర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ స్టాలిన్ నేతృత్వంలో ఈరోజు తంజావూరులో డీఎంకే నిరాహార దీక్షకు దిగింది. అనంతరం, స్టాలిన్ మాట్లాడుతూ, అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతను డిప్యూటీ సీఎంగానో లేక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానో నియమించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎందుకంటే, సీఎం జయలలిత మరికొంత కాలం ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో కావేరి జలాల వివాదం పరిష్కారానికి, ప్రభుత్వ కార్యక్రమాల సక్రమ నిర్వహణకు తాత్కాలిక సీఎంను నియమించాల్సిన అవసరం ఉందన్నారు. జయలలిత త్వరగా కోలుకోవాలని డీఎంకే పార్టీ, తమ అధినేత కరుణానిధి కోరుకుంటున్నారని స్టాలిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

More Telugu News