: సర్జికల్‌ స్ట్రయిక్స్ పై ఆధారాలు బయటపెట్టాలి.. లేదంటే అది బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే భావించాల్సి వస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ సర్జికల్‌ స్ట్రయిక్స్‌పై మ‌రోసారి స్పందించారు. నిన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్ ల‌క్షిత దాడుల అంశంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. భార‌త సైన్యం చేసిన దాడుల‌కు సంబంధించిన వీడియో పుటేజీని విడుద‌ల చేయాల్సిందేన‌ని అన్నారు. భ‌ద్ర‌తా కార‌ణాలు, రహస్య విషయాలు అంటూ ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్ట‌డం లేదని చెబుతున్న ప‌లువురి వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న స్పందిస్తూ... అలాగే మోదీ స‌ర్కారు భావిస్తే ఆ వీడియోను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో పాటు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మాత్ర‌మే చూపించాల‌ని డిమాండ్ చేశారు. వారి ద్వారా వాస్తవాలను ప్రజలకు తెలియచెప్పాలని దివాక‌ర్ రెడ్డి సూచించారు. లేదంటే ల‌క్షిత దాడులు చేశామ‌ని చెప్పుకుంటున్న ఆంశాన్ని బీజేపీ ఎన్నికల ఎత్తుగడగానే అనుకోవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు.

More Telugu News