: స్వల్ప ఒడిదుడుకుల మధ్య ఎటూ కదలని మార్కెట్

క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ఆపై అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారి పోయింది. నూతన కొనుగోళ్ల కంటే, అమ్మకాలే అధికంగా ఉండటంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య సూచికలు స్వల్పంగా నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ లు ఎటూ కదల్లేదు. ఆసియా మార్కెట్లు స్తబ్దుగా ఉండటం, యూరప్ లో నెలకొన్న తాజా అనిశ్చితి నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తగ్గిందని నిపుణులు వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 45.07 పాయింట్లు పడిపోయి, 0.16 శాతం నష్టంతో 28,061.14 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 11.95 పాయింట్లు పడిపోయి 0.14 శాతం నష్టంతో 8,697.60 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.01 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.02 శాతం నష్టపోయింది. ఇక ఎన్ఎస్ఈ-50లో 20 కంపెనీలు లాభపడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, జడ్ఈఈఎల్, బజాజ్ ఆటో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఇన్ ఫ్రాటెల్, ఏషియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,997 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,378 కంపెనీలు లాభాలను, 1,378 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,13,34,501 కోట్లకు చేరింది.

More Telugu News