: పైసాకే రూ.10 లక్షల బీమా.. దీపావళికి రైల్వే బంపర్ బొనాంజా!

ప్రయాణికులకు రైల్వేశాఖ దీపావళి బంపర్ బొనాంజా ప్రకటించింది. ఈ నెల 31 వరకు బుక్ చేసుకున్న అన్ని రకాల టికెట్లకు ఒక్క పైసాకే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 92 పైసల ప్రీమియంతో రూ.10 లక్షల వరకు బీమా కల్పిస్తున్న రైల్వే తాజాగా నేటి(శుక్రవారం) నుంచి పైసాకే అ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరింత మంది ప్రయాణికులను రైల్వే వైపు ఆకర్షించడంలో భాగంగానే ఈ సరికొత్త బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) సీఎండీ ఏకే మనోచా పేర్కొన్నారు. ఈ ఆఫర్ ప్రకటించిన నెల రోజుల్లోనే కోటిమందికి పైగా ప్రయాణికులు దీనిని వినియోగించుకున్నట్టు ఆయన తెలిపారు. 92 పైసలకే రూ.10 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్న రైల్వే, ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం కలిగినా రూ.10 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి రూ.7.5 లక్షలు, ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి వస్తే ఖర్చుల కింద రూ.2 లక్షల వరకు బీమా చెల్లిస్తుంది. అలాగే చనిపోయిన వారిని తరలించేందుకు రూ.10వేలు అందిస్తుంది. అనుకోని ప్రమాదాలు జరిగినా, ప్రయాణంలో ఉగ్రదాడి, దోపిడీ, పేలుళ్లు తదితర ఘటనలు జరిగినా ఈ బీమా కింద ప్రయాణికులకు రైల్వే పరిహారం అందిస్తుంది.

More Telugu News