: సింగరేణి కార్మికులకు సీఎం వరాల జల్లు.. లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా.. కార్మికుల హర్షాతిరేకం!

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు, తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాల నేతలతో ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణకు సీఎం అంగీకరించారని తెలిపారు. కాగా, 2015-16 సంవత్సరంలో సింగరేణి సంస్థకు రూ.1066.31 కోట్ల నికర ఆదాయం వచ్చింది. కాగా, లాభంలో కార్మికులకు 23 శాతం వాటా చెల్లించాలని నిర్ణయించారు. అంటే కార్మికులకు రూ.245.21 కోట్లు పంపిణీ చేస్తున్నారు. దీంతో, ఒక్కో కార్మికుడికి సగటున రూ.43,078 అందనుంది. అలాగే దీపావళి బోనస్ గా ప్రతి కార్మికుడికి రూ.54 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ఒక్కో కార్మికుడికి సుమారు 97 వేలు అందుతుంది. అంతేకాకుండా, సింగరేణిలో పనిచేసి గాయపడినా, అనారోగ్యం పాలైనా, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలనీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం కురిపించిన వరాలతో సింగరేణి కార్మికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News