: అమెరికాలో 'ఐఎస్ఐఎస్'కు వ్యతిరేకంగా ముస్లింల ప్రచారం

ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా... అమెరికాలో నివసిస్తున్న కొందరు ముస్లింలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇస్లాం మతం మొత్తానికి ఐసిస్ ఉగ్రవాదాన్ని అంటగడుతోందని... ఐసిస్ లో ఉన్నవారు ముస్లింలే కాదని వారు అంటున్నారు. తమ ప్రచారంలో భాగంగా భారీ కటౌట్లను ఏర్పాటు చేసి... ఐసిస్ కు వ్యతిరేకంగా నినాదాలను వాటిపై రాశారు. సెయింట్ లూయీ నుంచి మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లింలపై పడ్డ ఐసిస్ ముద్రను చెరిపివేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెస్టర్ ఫీల్డ్ కు చెందిన తారిఖ్ మాలిక్ చెప్పాడు. రాడికల్ భావాలు గల కొందరు వ్యక్తులు ఐఎస్ ను స్థాపించారని... ఆ సంస్థకు ఇస్లాం అనే ముద్ర వేయడానికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. జీవితమంటే ఎంతో పవిత్రమైనదని ఖురాన్ చెబుతోందని... ఆ సారాంశాన్ని ప్రపంచానికి తెలియజేయడమే తమ ధ్యేయమని చెప్పాడు. ఇస్లామిక్ ఫౌండేషన్ ఆఫ్ గ్రేటర్ సెయింట్ లూయీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపాడు.

More Telugu News