: సీఎం గారూ, నన్ను రేప్ చేసిన వాడు బెయిల్ మీద బయటికొచ్చాడు...భయమేస్తోంది: బీహార్ ముఖ్యమంత్రికి బాధితురాలి వాట్సాప్ మెసేజ్

తనను రేప్ చేసిన పవర్ ఫుల్ రాజకీయనాయకుడు బెయిల్ పై బయటకొచ్చాడని, ఇప్పుడు తనకు చాలా భయంగా ఉందని, తన కుటుంబాన్ని నాశనం చేస్తాడేమోనని బెంబేలెత్తిపోతున్నానని పదిహేనేళ్ల ఓ బాలిక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు వాట్స్ యాప్ ద్వారా విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకి వెళ్తే... గత ఫిబ్రవరి 6న ఆర్జేడీలోని శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన రాజ్ బల్లాబ్ యాదవ్ ఓ మహిళ ద్వారా పదో తరగతి చదువుతున్న బాలికను అటకాయించి రేప్ చేశాడు. అనంతరం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా, '30 వేల రూపాయలు ఇస్తాను, కేసు విత్ డ్రా చేసుకో' అంటూ బాలికకు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాడు. దానికి బాలిక కుటుంబం అంగీకరించకపోవడంతో నెల రోజులు పరారీలో ఉండి ఆ తర్వాత లొంగిపోయాడు. దీంతో న్యాయస్థానం అతనిని రిమాండుకి పంపింది. అతనికి తాజాగా బెయిల్ మంజూరు కావడంతో సదరు బాలిక బెంబేెలెత్తిపోతోంది. ఈ నేపథ్యంలో వాట్స్ యాప్ ద్వారా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మీడియా ప్రతినిధులు, ఇతర ప్రముఖులకు ఆమె మెసేజ్ పంపింది. అందులో...'నాపై అత్యాచారానికి పాల్పడిన యాదవ్ జైలు నుంచి బయటకొచ్చాడు. నేను నా కుటుంబం గురించి చాలా భయపడుతున్నాను. నాపై ఆ దుర్మార్గుడు చేసిన అఘాయిత్యంతో నేను సర్వం కోల్పోయాను. ఇప్పుడు నేను కొత్తగా కోల్పోయేందుకు ఏమీ లేదు. అయితే, నా కుటుంబాన్ని కోల్పోతానేమోనని భయమేస్తోంది. అతను నన్ను, నా కుటుంబాన్ని ఏ క్షణంలో నైనా అతను చంపగలడు. అతనికి పోలీసులు కూడా భయపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో రాజ్ కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లింది. దానిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

More Telugu News