: సర్జికల్ స్ట్రయిక్స్ పై స్టింగ్ ఆపరేషన్లో మొత్తం కక్కేసిన పాక్ పోలీసాఫీసర్!

భారత్ తమ దేశంలో సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించలేదని బుకాయిస్తున్న పాకిస్థాన్ దానిని నిరూపించేందుకు నానాతంటాలు పడుతోంది. లోలోపల వాస్తవం అంగీకరిస్తున్నా... అహం అడ్డం రావడంతో పాక్ పాతపాటే పాడుతోంది. దీంతో రంగంలోకి దిగిన భారత్ జాతీయ మీడియా పాకిస్థాన్ కు చెందిన వ్యక్తులతోనే సర్జికల్ స్ట్రయిక్స్ పై కూపీ లాగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మీర్పూర్ రేంజికి చెందిన స్పెషల్ బ్రాంచి ఎస్పీ అయిన గులాం అక్బర్ కు ఫోన్ చేసి, తాను ఉన్నతాధికారిని మాట్లాడుతున్నానని చెప్పి, సర్జికల్ స్ట్రయిక్స్ నిజమేనా? ఎలా జరిగాయి? ఏ సమయంలో జరిగాయి? మన ఆర్మీ ఎలా స్పందించింది? అంటూ భారత్ మీడియా ప్రతినిధి ప్రశ్నల వర్షం గుప్పించాడు. దీంతో జరిగిన ఘటన మొత్తం ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "సర్.. అది రాత్రి సమయం. ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి. సుమారు 3 నుంచి 4 గంటల పాటు కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్కసారిగా దాడులు ప్రారంభం కావడంతో పాకిస్థానీ సైనికులకు ఏం చేయాలో దిక్కు తోచలేదు... వారు తేరుకునే లోపే ఐదుగురు సైనికులు తూటాలకు బలయ్యారు. ఉగ్రవాదులు కూడా పెద్దఎత్తునే చనిపోయారు, అందరి మృతదేహాలను ట్రక్కులో వేసుకుని పాక్ సైన్యం వెళ్లిపోయింది. అయితే ఎంతమంది ఉగ్రవాదులు మరణించారో మాత్రం లెక్క సరిగ్గా తెలీదు" అన్నారు. అంతేకాదు, భారత సైన్యం దాడులు జరిపిన ప్రాంతాల పేర్లు కూడా ఆయన చెప్పడం విశేషం. సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత తేరుకున్న పాకిస్థానీ సైన్యం ఆ ప్రాంతం మొత్తాన్ని జల్లెడ పట్టిందని అన్నారు. అందులో భాగంగా ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లో ప్రవేశించడానికి పాకిస్థాన్ సైన్యం సాయం చేస్తోందని కూడా ఆయన వివరించారు. ఉగ్రవాదులను ఆర్మీయే తీసుకొస్తుందని, వారిని ఆర్మీయే కాపాడుతుందని, కనీసం తమకు కూడా వారి వివరాలు తెలియవని ఆయన పేర్కొన్నారు. జీహాదీల వివరాలు కేవలం ఆర్మీకి తప్ప ఇంకెవరికీ తెలియవని ఆయన చెప్పడం విశేషం.

More Telugu News