: మంత్రులు, ఎమ్మెల్యేలను చూస్తుంటే ముచ్చటేస్తోంది: చంద్రబాబు

సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు నాయకులు విద్యార్థులుగా మారి పాఠాలు నేర్చకోవడాన్ని చూస్తుంటే తనకు ముచ్చటేస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతి సమీపంలోని కేఎల్ యూనివర్శిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు నాయకత్వ సాధికారత సదస్సు రెండో రోజులో భాగంగా, కంప్యూటర్ ల్యాబ్ లో సీఎం డ్యాష్ బోర్డు, కైజాలా యాప్ పై శిక్షణ ఇచ్చారు. వర్శిటీలోని టెక్ విద్యార్థులు చెబుతుంటే, నేతలంతా బుద్ధిగా వింటుండటం, తమకు వచ్చిన అనుమానాలను వెంటనే నివృత్తి చేసుకుంటూ ఉండటాన్ని గమనించిన చంద్రబాబు, టెక్నాలజీ పరంగా ముందుంటే ప్రపంచం మొత్తం మన ముందున్నట్టేనని, తన పార్టీ నేతలకు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో విజయం సాధించానని అన్నారు. నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థేనని, నిరంతరం నేర్చుకుంటూ ఉండాలని సూచించారు. అప్ డేట్ కాకుంటే అవుట్ డేట్ అయిపోతారని హెచ్చరించారు. ఇప్పుడు నడుస్తున్న కాలంలో నూతన ఆవిష్కరణలదే ప్రధాన భూమికని, ఒక ఆలోచన ప్రపంచగతిని మార్చేస్తుందని అన్నారు భూగర్భంలో వేస్తే రూ. 3 వేల కోట్ల ఖర్చయ్యే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును, తనకొచ్చిన చిన్న ఆలోచనతో విద్యుత్ స్తంభాలపై వేయించి రూ. 300 కోట్లతో ముగించేశామని తెలిపారు. రెయిన్ గన్ లను తీసుకువచ్చి, ఎండిపోయే పంటలకు తడులు అందించామని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి విపక్షాలకు కనిపించం లేదని విమర్శించారు.

More Telugu News