: భార‌త్‌ను రెచ్చగొడితే మాత్రం ఊరుకోబోం: వెంకయ్య

భారత్, పాకిస్థాన్ మధ్య ఏర్ప‌డిన ప‌రిస్థితుల‌పై కేంద్ర వైఖ‌రి గురించి కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు స్పందించారు. ఈరోజు ఉద‌యం న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... భార‌త్ ఎవరితోనూ యుద్ధాన్ని కోరుకోద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, భార‌త్‌ను రెచ్చగొడితే మాత్రం ఊరుకోబోమ‌ని చెప్పారు. ఇటీవల పీవోకేలో భార‌త సైన్యం జ‌రిపిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. త‌రుచూ విసిగించే ప‌నిని కొంతమంది జనం చేస్తుంటార‌ని, అటువంటివారిని కేంద్రం నిశ్శబ్దంగానే డీల్ చేస్తుంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త‌ ఆర్మీ కూడా పీవోకేపై అదే రీతిలో దాడి చేసిందని అన్నారు. మ‌న సైన్యం జ‌రిపిన దాడుల‌కు సంబంధించి ఆధారాలు బ‌య‌ట‌పెట్టాలంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు చేస్తోన్న విమ‌ర్శ‌ల‌పై స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌ని వెంక‌య్య‌నాయుడు అన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు మ‌న సైన్యం నిబ‌ద్ధ‌త మీద అనుమానాలు ఉండ‌బోవ‌ని తాము అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు.

More Telugu News