: భారత ఆర్మీని కించ‌ప‌రిచే విధంగా కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న ఉంది: కేంద్రమంత్రి ర‌విశంక‌ర్‌ ప్ర‌సాద్

నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి ప్రవేశించి భారత ఆర్మీ చేసిన దాడుల‌పై ఇటీవ‌ల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ త‌ప్పుబ‌ట్టారు. కేజ్రీవాల్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో మోదీకి సెల్యూట్ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని కూడా అన్నారు. దీనిపై ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందిస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్య‌లు మ‌న దేశ‌ ఆర్మీని తక్కువ అంచనా వేసేలా ఉన్నాయ‌ని, కేజ్రీవాల్ అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం మానుకోవాలని అన్నారు. భార‌త సైన్యం పీవోకేలో చేసిన దాడికి ఆధారాలను విడుద‌ల చేయాల‌ని కేజ్రీవాల్ అనడం దురదృష్టకరమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌తో కేజ్రీవాల్ పాకిస్థాన్ ప్రధాన వార్తల్లో నిలిచారని ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అన్నారు. కేజ్రీవాల్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్న‌ వ్యాఖ్యలు పాకిస్థాన్ త‌మ‌కు సానూకూల అంశంగా మార్చుకొని వార్త‌లు ప్ర‌చురిస్తోంద‌ని మండిప‌డ్డారు. కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్య‌లు భార‌త‌ ఆర్మీని కించపరిచేలాగా ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు. అంతేగాక‌, భార‌త‌ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఇటువంటి అంశంపై రాజకీయాలు చేయకూడ‌ద‌ని సూచించారు.

More Telugu News