: గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ శ్రీ‌వారికి సేవ చేస్తా: డాలర్ శేషాద్రి

తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో దేవస్థానం ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి కనపడడం లేదు. అనారోగ్యం కారణంగానే ఆయ‌న బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన‌డం లేదు. ఈ అంశంపై శేషాద్రి స్పందించారు. మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... త‌న తుది శ్వాస వరకు శ్రీ‌వారి సేవకే త‌న జీవితం అంకితమ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలంటే ప్రాణమ‌ని తెలిపారు. త‌న‌కి బ్ర‌హ్మోత్స‌వాల‌కి రావాల‌ని ఉంది కానీ, డాక్ట‌ర్లు వ‌ద్ద‌ని సూచిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. మరో పదిరోజుల తర్వాత వెళ్ల‌వ‌చ్చ‌ని వైద్యులు తనకు చెబుతున్న‌ట్లు శేషాద్రి పేర్కొన్నారు. త‌న‌ వయసు మీద పడుతోందని, వైద్యులు చెప్పిన సూచ‌న‌లు పాటించ‌క తప్పడం లేదని ఆయ‌న అన్నారు. తాను 1977లో ఉత్తర పారుపత్తేదార్‌గా విధుల్లో చేరిన‌ట్లు, ఆ త‌రువాత వివిధ హోదాల్లో పనిచేసిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. 32 ఏళ్ల వ్య‌వ‌ధిలో 18 ఏళ్లపాటు వేంక‌టేశ్వ‌రుడి దేవ‌స్థానంలోనే పనిచేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 2006వ సంవ‌త్స‌రంలో జూలై 31 వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన‌ట్లు పేర్కొన్నారు. అనంత‌రం ఏడుకొండ‌వాడు త‌న‌కు ఆలయ ఓఎస్‌డీగా కొనసాగేలా అవకాశాన్ని ప్ర‌సాదించాడ‌ని ఆయ‌న అన్నారు. త‌న గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కూ శ్రీ‌వారికి సేవ చేస్తాన‌ని డాలర్ శేషాద్రి పేర్కొన్నారు. త‌న ఉద్యోగ జీవితంలో 60కిపైగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి ఏడాది వ‌చ్చే శ్రీ‌వారి బ్రహ్మోత్సవాలతోపాటు అధికమాసంలోనూ రెండు బ్రహ్మోత్సవాలూ ఉన్నాయని, అవి దేనికవే సాటి అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

More Telugu News