: కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రికార్డు.. గాంధీ జయంతి రోజు అత్యధిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఘనత

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు రికార్డు సృష్టించారు. మహాత్మాగాంధీ జయంతి రోజున అత్యధిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రిగా ఘనత సొంతం చేసుకున్నారు. ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్ ల వద్ద ఉదయాన్నే వారికి నివాళులు అర్పించారు. అనంతరం న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్వచ్ఛభారత్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఆ తర్వాత సిరిఫోర్ట్ ఆడిటోరియంలో స్వచ్ఛభారత్‌పై తీసిన లఘుచిత్రాలను వీక్షించి అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఓ టీవీ షో చర్చలో పాల్గొన్నారు. ఆ తర్వాత తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అనంతరం గుజరాత్ సీఎం, కేంద్రమంత్రులతో కలిసి పోర్‌బందర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత టెలికం శాఖా మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి స్వచ్ఛభారత్‌పై పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. చివరిగా సాయంత్రం సఫాయిగిరి కార్యక్రమంలో పాల్గొని అవార్డులు ప్రదానం చేశారు. ఇలా ఆదివారం మొత్తం ఊపిరి సలపని కార్యక్రమాలతో బిజీగా గడిపి ఒకే రోజు అత్యధిక కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్రమంత్రిగా రికార్డు నెలకొల్పారు.

More Telugu News