: 'రాజాధిరాజ రాజగంభీర... పరాక్, బహుపరాక్' అన్న గొంతు ఇక లేదు!

తమిళ సీనియర్ నటుడు, నడిగర్ సంఘం ఉపాధ్యక్షుడు కేఎన్ కాళై గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయనకు భార్య టీకే వసంత, కొడుకులు రాజు, రఘునాథన్ ఉన్నారు. దాదాపు 200 చిత్రాల్లో నటించిన ఆయన, 1000 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పారు. రజనీకాంత్ నటించిన 'చంద్రముఖి' చిత్రంలో రాజు పాత్ర ప్రవేశిస్తున్న వేళ, 'రాజాధిరాజ రాజగంభీర... పరాక్, బహుపరాక్' అని వినిపించే మాటలు ఆయన నోటి నుంచి వెలువడినవే. 10 వేలకు పైగా నాటకాలు ఆడిన కాళై, ఎమ్జీ రామచంద్రన్, శివాజీ గణేశన్ వంటి ఎందరో స్టార్లతో కలిసి నటించారు. తమిళ సర్కారు ఆయనకు కలైమామణి బిరుదునిచ్చి సత్కరించగా, మలేషియా ప్రభుత్వం సైతం 'నాటక కావలన్' అవార్డునిచ్చి గుర్తించింది. కాళై మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కేఎన్ కాళై భౌతిక కాయానికి ఆదివారం సాయంత్రం చెన్నై, ట్రిప్లికేన్‌ లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు ముగిశాయి.

More Telugu News