: పాక్ ఆర్టిస్టులపై ప్రతాపం సరికాదు.. టమోటా, క్యాప్సికమ్ మనవి కాకున్నా తినడం లేదా?: ప్రకాష్‌రాజ్

పాకిస్థాన్ ఆర్టిస్టులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన డిమాండ్‌పై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఎంఎన్ఎస్ డిమాండ్ సరికాదన్నారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, రైటర్లు ఏం చేశారని ప్రశ్నించారు. తన సినిమా ‘మన ఊరి రామాయణం’ దసరాకు విడుదల కానున్న సందర్భంగా మాట్లాడిన ఆయన పాక్ నటీనటులు దేశం విడిచి వెళ్లిపోవాలన్న డిమాండ్‌పై స్పందించారు. బ్రిటిష్ వాళ్లు ఇండియాను పాలించిన విషయాన్ని గుర్తుచేసిన ప్రకాష్ రాజ్ విలియం షేక్ స్పియర్‌ను బ్యాన్ చేస్తారా? టాల్‌స్టాయ్ రచనలు చదవడం ఆపేస్తారా? అని ప్రశ్నించారు. ‘‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదో ఒకటి మాట్లాడడం కాకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. కావేరీ నదీ జలాల సమస్య వచ్చినప్పుడు కన్నడిగులు తమిళుల్ని, తమిళులు కన్నడిగుల్ని కొడితే సమస్య తీరిపోతుందా? పొట్ట కూటి కోసం పనిచేసుకునే డ్రైవర్‌ను కొడితే ఎలా? కావేరీ నీళ్లకు, అతడికి ఏమిటి సంబంధం? ఈ మొత్తం ఘటనలో రైతు రోడ్డుపైకి వచ్చి దాడి చేయడం, వాహనాలు తగలబెట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడలేదే? ఎవరో పంపించిన మనుషులే ఇదంతా చేశారు. టమాట, క్యాప్సికమ్.. మనవి కాదు. అయినా తినడం లేదా? మన కల్చర్ మనకుంటుంది. సరిహద్దులూ ఉంటాయి. అందరినీ అంగీకరించాలి. గ్లోబల్ సిటిజన్‌గా ఉండాలి. అంతేకాని ఇది సరైన పద్ధతి కాదు. రెచ్చగొట్టి ప్రజల్లో విద్వేషాలు నింపడం సరికాదు’’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.

More Telugu News