: పై అధికారిపై కోపంతో సరిహద్దు దాటి.. పాక్ చేతిలో బందీ అయిన సైనికుడు!

ఎల్ఓసీ దాటి పాకిస్థాన్ లో అడుగుపెట్టిన భారతీయ సైనికుడు చందు బాబులాల్ చౌహాన్ తన పై అధికారిపై కోపంతో సరిహద్దులు దాటినట్టు తెలుస్తోంది. పై అధికారి తన పట్ల వ్యవహరిస్తున్న తీరుపై కినుక వహించిన బాబులాల్ గురువారం మధ్యాహ్నం నియంత్రణ రేఖ వైపు వెళ్లాడు. ఆయన అలా వెళ్లడాన్ని గమనించిన సహచరులు హెచ్చరించినట్టు సమాచారం. పై అధికారి వ్యవహార శైలితో విచక్షణ కోల్పోయిన బాబులాల్ వారి హెచ్చరికలు పట్టించుకోకుండా నియంత్రణ రేఖ దాటాడు. దీంతో ఆయన పాకిస్థాన్ సైనికుల చేతికి చిక్కాడు. కాగా, ఆయన విడుదల కోసం భారతదేశం దౌత్య మార్గాల్లో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో పాక్ నిర్బంధంలో ఉన్న ఆయన సమీప భవిష్యత్తులో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన బాబులాల్ కు మెరుపుదాడులతో సంబంధం లేనప్పటికీ, భారత్ పై కసిని ఆయనపై పాక్ చూపించే అవకాశం ఉంది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

More Telugu News