: ‘బాహుబలి’ ప్రభాస్ కు అరుదైన గౌరవం.. మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ‘డార్లింగ్’ మైనపు విగ్రహం

‘బాహుబ‌లి’ ప్ర‌భాస్‌ అరుదైన ఘ‌న‌తను సొంతం చేసుకోబోతున్నారు. ఆయ‌న‌ అభిమానుల‌కు మేడ‌మ్ టుస్సాడ్స్ ఈరోజు బిగ్ న్యూస్ చెప్పింది. బ్యాంకాక్‌లోని మేడ‌మ్ టుస్సాడ్స్ మ్యూజియంలో త్వ‌ర‌లోనే డార్లింగ్ ప్ర‌భాస్ విగ్రహం చూడొచ్చ‌ని ఈరోజు అధికారికంగా ప్ర‌క‌టించింది. స‌ద‌రు మ్యూజియం అధికారి ఒక‌రు ఈ విష‌యాన్ని మీడియాకు చెప్పారు. అందుకోసం తాము ఇప్పటికే హైద‌రాబాద్‌లో ప్ర‌భాస్ ఫొటోలు, కొల‌త‌లు తీసుకున్న‌ట్లు చెప్పారు. బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ గుర్తింపు సాధించిన ప్ర‌భాస్ ఈ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న‌ మొట్ట‌మొద‌టి సౌత్ ఇండియ‌న్ స్టార్‌గా నిలిచాడు. ‘యంగ్ రెబల్ స్టార్’ మైన‌పు విగ్ర‌హాన్ని రూపుదిద్ద‌డానికి ప‌నుల‌ను మొద‌లుపెట్టిన త‌మ నిపుణులు వ‌చ్చే ఏడాది మార్చిలో విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తార‌ని అధికారి తెలిపారు. ఈ ఘ‌న‌త‌ను పొందుతున్న మూడో భార‌తీయుడు కూడా ప్ర‌భాసే. ప్ర‌పంచ దిగ్గ‌జ సెల‌బ్రిటీల స‌ర‌స‌న ప్ర‌భాస్ మైన‌పు విగ్ర‌హం నిల‌వ‌నుంద‌ని తెలుసుకున్న డార్లింగ్ ప్ర‌భాస్‌ అభిమానులు సోష‌ల్ మీడియాతో ఆయ‌న‌ను నిజంగానే ఛ‌త్ర‌ప‌తి అని కీర్తిస్తున్నారు. ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్య‌మాల్లో, ప్ర‌భాస్ నుంచి మేడ‌మ్ టుస్సాడ్స్ కు సంబంధించిన సిబ్బంది కొల‌త‌లు తీసుకుంటుండ‌గా తీసిన ఫొటోలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఈశ్వ‌ర్ సినిమాతో సినిమాల్లోకి ప్ర‌వేశించిన ప్ర‌భాస్ వ‌ర్షం, ఛ‌త్ర‌ప‌తి, డార్లింగ్‌, మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్‌, మిర్చి, బాహుబ‌లి సినిమాల‌తో అగ్ర హీరోల్లో ఒక‌రిగా నిలిచారు.

More Telugu News