: జయలలితకు చికిత్స అందుతోంది.. కోలుకుంటున్నారు: అన్నాడీఎంకే ప్రకటన
సెప్టెంబరు 22న జ్వరంతో చెన్నై ఆసుపత్రిలో చేరిన తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అన్నాడీఎంకే ఈరోజు ఓ ప్రకటన చేసింది. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రన్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. జయలలితకు లండన్ నుంచి వచ్చిన డాక్టర్ రిచడ్స్ చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. జయలలిత ఫోటోలను విడుదల చేయాలని ప్రతిపక్ష నేత కరుణానిధి డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆ అవసరం లేదని రామచంద్రన్ పేర్కొన్నారు. తాము ప్రజలకు మాత్రమే జవాబుదారులమని చెప్పారు. అంతేకాని, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పబోమని వ్యాఖ్యానించారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయవాది రీగన్ జయలలిత ఆరోగ్యంపై స్పందిస్తూ.. అసలు ఏం జరుగుతోందో ప్రకటించాలని, గవర్నర్ను అక్కడికి పంపించాలని రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీకి లేఖ రాశారు. తమిళనాడులో పరిపాలన బాధ్యతలు చేపట్టడానికి అవసరమైతే ఆర్టికల్ 356ను ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు.