: మేము శాంతిని కోరుకుంటున్నాం.. మీకు ఇష్టమైతే దోస్తీకి రెడీ: భారత్ కు ఇమ్రాన్ ఖాన్ స్నేహహస్తం

పాకిస్థాన్ ప్రజలు అందరూ ప్రధాని నవాజ్ షరీఫ్ మాదిరి కాదని మాజీ క్రికెటర్, తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అన్నారు. రాయివిండ్ లో జరిగిన ర్యాలీలో ఇమ్రాన్ మాట్లాడుతూ... భారత్ తో నవాజ్ షరీఫ్ ఘర్షణాత్మక వైఖరిని తప్పుబట్టారు. ‘పాక్ ప్రజలందరినీ నవాజ్ షరీఫ్ లా భావించకండి. మా దేశం అంతా ఐక్యంగానే ఉంది. నవాజ్ షరీఫ్ కు ధనంపై వ్యామోహం ఎక్కువ. ఐక్యరాజ్యసమితి వేదికపై నవాజ్ షరీఫ్ అయిష్టంగానే పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడారు. నవాజ్ షరీఫ్ కు అటువంటి ప్రసంగాన్ని ఇవ్వాలని లేకపోయినా ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్ ఒత్తిడి మేరకే అలా చేశారని మోదీ కూడా చెప్పారు’ అని ఇమ్రాన్ అన్నారు. పాకిస్తాన్ ప్రజలు భారత్ తో శాంతిని, స్నేహాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. ‘మేము శాంతిని కోరుకుంటున్నాం. మీకు ఇష్టమైతే స్నేహానికి రెడీ’ అని అన్నారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం చూపదన్నారు.

More Telugu News