: కర్ణాటకకు న్యాయం కోసం దీక్షకు దిగిన దేవెగౌడ

కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటకకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మాజీ ప్రధాని దేవెగౌడ ఈ రోజు బెంగళూరులోని విధాన సౌద ముందు దీక్ష చేపట్టారు. తమిళనాడుకు ఆరువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విషయమై అన్ని పార్టీల ఆమోదం కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి కావేరీ జలాల విషయంలో జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా విధాన సౌద ముందున్న గాంధీ విగ్రహం ముందు మద్దతుదారులతో దేవెగౌడ దీక్షకు కూర్చున్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు. తాగడానికి తమకు నీరు లేకపోయినా తమిళనాడుకు నీరు విడుదల చేయమనడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోని రిజర్వాయర్ల వద్ద పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఓ నిపుణుల కమిటీని పంపించాలని కోరారు. ముందు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకకు మరణ శాసనమని, అయినా ప్రజలు శాంతియుతంగా ఉండాలని కోరారు.

More Telugu News