: పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు త‌ప్ప‌వన్న ఎంఎన్ఎస్.. సల్మాన్ ఖాన్ ను పాకిస్థాన్ వెళ్లిపోవాలన్న శివ‌సేన‌

యూరీ ఉగ్రదాడి జ‌రిగిన అనంత‌రం బాలీవుడ్ లోని పాకిస్థాన్ నటులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన చేసిన హెచ్చరిక‌ల‌పై బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్ స్పందిస్తూ నిన్న చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లపై శివ‌సేన, ఎంఎన్ఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. యూరీ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింది ఉగ్ర‌వాదులే.. కానీ న‌టీన‌టులు కాదని, వారు భార‌త్ కు రావచ్చని ఆయ‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. సల్మాన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన‌ శివసేన నాయకురాలు మనీషా కాయండే.. ఆయ‌న‌కు ఈ విషయంలో పాఠం నేర్పించాలని వ్యాఖ్యానించారు. ఆ దేశ‌ నటులంటే సల్మాన్‌కు అంత ప్రేమ ఉంటే ఆయనే పాక్‌కు వెళ్లిపోవాలని ఆమె అన్నారు. స‌ల్మాన్ వ్యాఖ్య‌ల‌పై ఎంఎన్ఎస్ నేత‌ అమే ఖోప్కర్ స్పందిస్తూ.. ఇండియాలో ఉంటున్న‌ పాకిస్థానీ నటులు వర్క్ పర్మిట్లు తీసుకోకుండానే ఇక్క‌డ‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. టూరిస్ట్ వీసాపై వారు భార‌త్‌కు వ‌స్తున్నార‌ని అన్నారు. ఇది చట్టవ్యతిరేకమే అని ఆయన సల్మాన్‌కు స‌మాధాన‌మిచ్చారు. ఈ అంశాన్ని తాము స‌ర్కారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్ర‌స్తుతం మాత్రం పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. అంతేగాక‌, ఆ దేశ న‌టీన‌టులు ప‌నిచేస్తోన్న బాలీవుడ్‌ సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటామ‌ని చెప్పారు.

More Telugu News