: పాకిస్థాన్‌కు ప్రజాస్వామ్యం సరికాదు.. అందుకే ఆర్మీ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది: ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులకు ప్రజాస్వామ్యం ఎంతమాత్రమూ సరికాదని ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు ప్రజాస్వామ్యం సరిపోదు కాబట్టే ఆర్మీ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని అన్నారు. వాషింగ్టన్ ఐడియాస్ ఫోరం ఇంటర్వ్యూలో మాట్లాడిన ముషారఫ్ పై వ్యాఖ్యలు చేశారు. తమవి ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్నవారు సరిగా పనిచేయకపోవడం వల్లే ఆర్మీ కీలకపాత్ర పోషించాల్సి వస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందన్నారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం లేదని, ఇది పాక్‌కు వారసత్వ బలహీనత అని ఆయన వివరించారు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వైపు కాకుండా సైన్యం వైపే చూస్తారని తెలిపారు. ప్రభుత్వ వ్యవహారాల్లో సైన్యం జోక్యం చేసుకోవడానికి ఇది కూడా ఓ కారణమని ఆయన అన్నారు. దేశంలో తిరుగుబాటు చర్యలను సమర్థించిన ముషారఫ్ ఆర్మీ తనకు మద్దతుగా నిలవడంపై గర్వపడతానని పేర్కొన్నారు. దేశంలోని రాజకీయ వ్యవస్థను మార్చాల్సి ఉందన్న ముషారఫ్ తనకు మాత్రం సైన్యమే రాజ్యాంగమని పేర్కొన్నారు.

More Telugu News