: శ్రీనగర్ లో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ.. లాల్ చౌక్ ఆక్రమణకు వేర్పాటు వాదుల పిలుపు
శ్రీనగర్ లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేర్పాటు వాదులు లౌల్ చౌక్ ఆక్రమణకు పిలుపునివ్వడమే ఇందుకు కారణం. పైగా ఈ రోజు శుక్రవారం కూడా కావడంతో ప్రార్థనల అనంతరం అల్లర్లు చోటు చేసుకోవచ్చన్న సందేహాల నడుమ భ్రదతా బలగాలు కర్ఫ్యూ విధించాయి. శ్రీనగర్, బాంటమాలూ, మైసుమ ప్రాంతాల్లోని ఐదు పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చారు. అయినా ప్రార్థనల అనంతరం ఆందోళనకారులు కర్ఫ్యూను ఉల్లంఘించి అల్లర్లకు దిగవచ్చన్న సందేహంతో భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఇనుప కంచెలతో లాల్ చౌక్ కు దారితీసే అన్ని మార్గాలను మూసివేశారు. శాంతి భద్రతల సంరక్షణ కోణంలో ముందు జాగ్రత్తగానే వ్యాలీ అంతటా సెక్షన్ 144 సీఆర్పీసీ కింద ఆంక్షలు అమల్లోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వేర్పాటు వాదుల పిలుపు మేరకు వ్యాలీ అంతటా దుకాణాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి.