: కోహ్లీ, ధావన్, విజయ్ ఘోరంగా విఫలమైనా.. క్రీజులో నిలదొక్కుకున్న రహానే, పుజారా... హాఫ్ సెంచరీ చేసిన పుజారా

కోల్‌క‌తా వేదిక‌గా న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌తో ఈరోజు కొన‌సాగుతున్న రెండో టెస్టు మ్యాచులో టీమిండియా ఆట‌గాళ్లు విరాట్‌ కోహ్లీ, శిఖ‌ర్‌ ధావన్, విజయ్‌ కనీసం రెండంకెల స్కోరయినా చేయకుండానే వికెట్లు సమర్పించుకున్న వేళ క్రీజులోకి అడుగుపెట్టిన అజింక్యా ర‌హానే, చటేశ్వర పుజారా మైదానంలో నిల‌దొక్కుకున్నారు. నిలకడైన ఆటతీరును క‌న‌బ‌రుస్తున్నారు. న్యూజిలాండ్ బౌల‌ర్లు బౌల్ట్‌, హెన్రీ బౌలింగ్ విసిరిన బంతుల ధాటికి 46 పరుగులకే టాప్ ఆర్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఒత్తిడిలో ఉన్న టీమిండియాను వారు గ‌ట్టెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. చటేశ్వర పుజారా అద్భుతంగా బంతులు ఎదుర్కుంటూ హాఫ్ సెంచ‌రీ చేశాడు. అజింక్యా ర‌హానే కూడా హాఫ్ సెంచ‌రీ సాధించే దిశ‌గా దూసుకుపోతున్నాడు. ప్ర‌స్తుతం 57 పరుగుల‌తో పుజారా, 35 ప‌రుగుల‌తో ర‌హానే క్రీజులో ఉన్నారు. మూడు వికెట్లు కోల్పోయిన టిమిండియా 117 ప‌రుగుల‌తో ఆట‌ను కొన‌సాగిస్తోంది.

More Telugu News