: హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ దుర్మరణం

హైదరాబాద్‌లోని పెద్ద అంబర్‌పేటలో గురువారం రాత్రి ఒంటిగంట సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు పెద్ద అంబర్‌పేట సమీపంలో ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సునీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం ధాటికి కొందరు ప్రయాణికులు ఎగిరి పడ్డారు. కాళ్లు, చేతులు విరిగిన ప్రయాణికులను వెంటనే సమీపంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయింది. కాస్త అటుఇటు అయి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యమే ఈ ప్రమాదానికి కారణం అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. డ్రైవర్ బస్సును మధ్యలో మూడుసార్లు ఆపి తనతో తెచ్చుకున్న మద్యాన్ని తాగినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News