: కత్తి పట్టుకుని మూడంతస్తులు దొడ్డి దారిలో ఎక్కి... భయపెట్టిన కుర్రాడు

ఆ రోజు బుధవారం... సాయంత్రం అవుతోంది. ముంబైలోని భయాందర్ వెస్ట్ ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఓ యువకుడు కత్తి తీసుకుని దొడ్డిదారిలో ప్లానటేరియా కాంప్లెక్స్ అపార్ట్ మెంట్ మూడో అంతస్తుకు చేరుకున్నాడు. ఇదంతా తన కన్నతల్లిపై చేయి చేసుకున్న ఓ మహిళ అంతు చూడాలన్న ఆవేశంతో చేసిన పని. పోలీసుల కథనం మేరకు ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధోనీ గోపాల్ (20) అనే యువకుడు రిజ్వీ కాలేజీ విద్యార్థి. భయాందర్ పశ్చిమ ప్రాంతంలో ఉంటున్నాడు. బుధవారం గోపాల్ తల్లికి, ఎదురుగా అపార్ట్ మెంట్లో ఉండే ఓ మహిళకు మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో సదరు మహిళ గోపాల్ తల్లిపై చేయి చేసుకుంది. దీంతో గోపాల్ లో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఇంట్లో ఉన్న పొడవాటి కత్తిని తీసుకుని బయటకు వచ్చాడు. అపార్ట్ మెంట్ లోని సదరు మహిళ ఇంటికి వెళ్లి డోర్ కొట్టాడు. వారు తలుపు తీయలేదు. తీవ్ర ఆవేశంలో ఉన్న ఆ యువకుడు మౌనంగా తిరిగి వెళ్లిపోలేదు. ప్యారాపెట్ వైపు నుంచి ఎక్కుతూ మూడో అంతస్తులో ప్రత్యర్థి ఇంటికి చేరుకున్నాడు. లోపలికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చేసేది లేక కిందకు దిగివచ్చాడు. అప్పటికే అక్కడ గుమికూడిన జనం రిజ్వీని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

More Telugu News