: ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలి: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

సాధారణ పరిపాలనపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, జిల్లాల అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని, ప్రత్యేక ప్రణాళికలతో కలెక్టర్లు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. విజయవాడలో రెండో రోజు కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ప్రణాళిక, కార్యాచరణ ఫలితాలు సాధించేలా చర్యలు ఉండాలని సూచించారు. గృహనిర్మాణం, వైద్య ఆరోగ్యం, పెండింగ్ పెట్టుబడులు, శాంతిభద్రతలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా ప్రగతి నివేదికలను సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. జిల్లాల్లో చేయబోయే పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. జిల్లాల్లో అభివృద్ధి పనులపై సీఎంకు కలెక్టర్లు వివరిస్తున్నారు. ఒక్కో కలెక్టర్ 10 నిమిషాలపాటు చంద్రబాబుకు ఆయా అంశాలపై వివరణ ఇస్తున్నారు. కాగా, విజిలెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెబ్ సైట్ ను సీఎం ప్రారంభించారు. ఈ సదస్సులో చంద్రబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, డీజీపీ సాంబశివరావు, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, కేఈ కృష్ణమూర్తి, పుల్లారావు, దేవినేని ఉమ, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

More Telugu News