: విద్యార్థికి ప్రాణదానం చేసిన టీచరమ్మ!

పిల్లలకు కేవలం విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా, అవసరమైతే వారికి ప్రాణదానం కూడా చేస్తామని నిరూపించింది ఓ టీచరమ్మ. అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వానికి మచ్చుతునకగా మిగిలింది. అమెరికాకు చెందిన లైలా (6) నాలుగేళ్ల వయసులోనే తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెను పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పాడైపోయాయని తెలిపారు. దీంతో ఆమెకు డయాలసిస్ చేస్తున్నారు. దీంతో ఆమె వారంలో రెండు రోజులే స్కూలుకి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆమె రెండు కిడ్నీలు డయాలసిస్ కు కూడా స్పందించడం లేదని, అలాంటి పరిస్థితుల్లో ఆమె రోగాన్ని నయం చేయలేమని డాక్టర్లు చేతులెత్తేశారు. కిడ్నీ మార్పిడీ చేస్తే లైలా మళ్లీ మామూలు మనిషి అవుతుందని తెలిపారు. దీంతో ఆమె తల్లిదండ్రులు దాతల కోసం ప్రయత్నించారు. సుమారు వంద మందిని సంప్రదించగా వారిలో ఎవరి కిడ్నీ పాపకు సరిపోలేదు. దీంతో లైలా చదువుతున్న స్కూల్ లో కొత్తగా చేరిన టీచర్ బెత్ బటిస్టా ఆమె పరిస్థితిని చూసి చలించిపోయి, తన కిడ్నీ ఇస్తానని ముందుకొచ్చింది. ఇందు కోసం వైద్య పరీక్షలు చేయించుకున్న ఆమె కిడ్నీ సరిపోవడంతో లైలా తల్లిని స్కూల్ కి పిలిచారు. అక్కడ ఆమెకు ఆసుపత్రిలో కిడ్నీ దానం చేసేందుకు అవసరమైన ఫాం సంతకం చేసి చేతిలో ఉంచింది సదరు టీచర్. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ సీసీ టీవీలో రికార్డు కాగా, దానిని స్కూలు యాజమాన్యం యూట్యూబ్ లో పెట్టగా అది సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ పొందుతోంది.

More Telugu News