: ప్రేమికులకు ఫోన్ చేసి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన పోలీసులు.. చివరికి అరెస్ట్
హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో ఇద్దరు కానిస్టేబుళ్లు, హోంగార్డు కలిసి ప్రేమికులను బ్లాక్మెయిల్ చేసి డబ్బు సంపాదించడం మొదలెట్టారు. వారి పాపం పండి చివరికి అరెస్టయ్యారు. అత్తాపూర్ ఎర్రబోడకు చెందిన ఓ ప్రేమ జంటను కానిస్టేబుళ్లు రవీందర్, పరిపూర్ణాచారి, హోంగార్డు ఆనంద్ బెదిరించారు. తమకు లక్ష రూపాయలు ఇవ్వాలని, లేదంటే తాము ఏం చేస్తామో చూడమని బెదిరించారు. భయపడిపోయిన సదరు ప్రేమజంట రూ. 29 వేలు వారికి ఇచ్చుకున్నారు. ఉచితంగా వచ్చే డబ్బుపై ఆశ ఇంకా చావక.. తాము డిమాండ్ చేసిన మొత్తం డబ్బును ఇవ్వాలని మళ్లీ వేధించారు. తరచూ ఫోన్లు చేస్తూ బెదిరించారు. చివరికి ఆ ప్రేమజంట తమను సదరు పోలీసులు బెదిరిస్తున్నారని పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో వీరిని అరెస్ట్ చేశారు.