: మహిళలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారు: సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని తన దత్తత గ్రామాలయిన ఎర్రవెల్లి, నరసన్న పేట గ్రామాల అభివృద్ధిపై ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రెండు గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని అన్నారు. ఇరు గ్రామాల్లో 50 నుంచి 60 బోర్లు వేసుకోవాలని సూచించారు. ముందుగా ఊహించినట్లే ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయని ఆయన అన్నారు. భూగర్భజలాలు బాగా పెరుగుతున్నాయని కేసీఆర్ చెప్పారు. మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో ఎక్కువ నీళ్లు చేరాయని చెప్పారు. పరస్పర సహకారంతో వ్యవసాయం చేసుకోవాలని సూచించారు. మరో రెండేళ్లలో గోదావరి జలాలు రాష్ట్రానికి వస్తాయని ఆయన చెప్పారు. ఆ జలాలు వస్తే రాష్ట్రంలో నీటికి ఇబ్బందులు ఉండబోవని అన్నారు. పద్ధతి ప్రకారం వ్యవసాయం చేసుకోవాలని అన్నారు. శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని చెప్పారు. మహిళలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారని కేసీఆర్ అన్నారు. ఇందిరా గాంధీ ప్రధానిగా బాగా పనిచేశారని వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధిలో మహిళలు తమవంతు సాయం అందించాలని కోరారు. తమ ప్రయత్నమంతా రెండు గ్రామాల కోసమే కాదని, ఎర్రవెల్లి, నరసన్న పేట గ్రామాలను చూసి మిగతా గ్రామాలన్నీ ఇలాగే తయారు కావాలని ఆయన అన్నారు. మల్లన్న సాగర్ పంచాయతీ ఇక ముగిసిందని ఆయన అన్నారు.