: షాకింగ్... అభిమానినంటూ పాకిస్థాన్ టీవీ యాంకర్ కు విషం కలిపిన ఐస్ క్రీం ఇచ్చాడు

సాధారణంగా సెలెబ్రిటీలు కనిపిస్తే అభిమానులు వారితో సెల్ఫీలు దిగడం, వారికి బహుమతులు ఇవ్వడం చేస్తుంటారు. ఇలాంటి ఓ అభిమాని ఓ టీవీ యాంకర్ ప్రాణాల మీదికి తెచ్చాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాకిస్థాన్‌ లోని ప్రముఖ ఉర్దూ ఛానెల్ లో సనా ఫైసల్‌ ‘ఖుఫియా’ అనే టీవీషోకు యాంకర్‌ గా వ్యవహరిస్తోంది. ఆదివారం ఆమె భర్తతో కలిసి నజీమాబాద్‌ లోని పెషావరీ ఐస్‌ క్రీం స్టోర్‌ కు వెళ్లింది. అక్కడ ఓ 15 ఏళ్ల కుర్రాడు ఆటోగ్రాఫ్ తీసుకుని, సెల్ఫీ తీసుకున్నాడు. అనంతరం తన కోరిక మన్నించాలంటూ ఓ ఐస్ క్రీమ్ కొనిచ్చాడు. అభిమాని ఇచ్చిన ఐస్ క్రీం తిన్న సనా ఫైసల్ ఇంటికి వెళ్తూ అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె భర్త హుటాహుటీన స్థానిక ఆసుపత్రికి తరలించగా, ఆమె తిన్న ఐస్ క్రీంలో విషం కలిసిందని తేలింది. చికిత్స అనంతరం ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఐస్‌ క్రీమ్‌ ఇచ్చిన యువకుడు ఎవరు? ఎందుకిచ్చాడు? విషం ఎందుకు కలిపాడు? అనే కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు.

More Telugu News