: ప్రజలపై భారీ వర్షాల దెబ్బ... కూరగాయల ధరలకు అమాంతం రెక్కలు

గడచిన రెండు వారాలుగా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఎకరాల పంట నీట మునిగిపోగా, ఆ ప్రభావం సామాన్యులపై పడింది. ఇటీవలి కాలంలో కాస్తంత అందుబాటులో ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి పెరిగాయి. నిన్నమొన్నటి వరకూ కిలో రూ. 7 నుంచి 10గా ఉన్న టమాటా ధర రూ. 25కు ఎగసింది. ఒక్కో మునగకాయను రూ. 10కి అమ్ముతున్నారు. దొండకాయ కిలో రూ. 40కి చేరింది. ఆకుకూరల లభ్యత మృగ్యం కాగా, కట్ట పాలకూర ధర రూ. 5కు పెరిగింది. క్యారెట్ ధర కిలోకు రూ. 45, నల్లవంకాయ రూ. 42కు, చిక్కుడు రూ. 50కి చేరాయి. ఒక్క హైదరాబాద్ నగరానికే రోజుకు రూ. 2,800 టన్నుల కూరగాయలు అవసరం కాగా, 2 వేల టన్నులు మాత్రమే వస్తున్నందున ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. హోల్ సేల్ మార్కెట్లకు కూరగాయల రాక తగ్గగా, సూపర్ మార్కెట్లు తమ వద్ద నిల్వ ఉంచిన సరుకును రెట్టింపు ధరలకు అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News