: మహిళల నగ్న దృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేసిన యువకుడు.. అరెస్ట్!

అమాయక మహిళలను మాయమాటలతో లోబరుచుకుని ఆపై వారి నగ్నదృశ్యాలను చిత్రీకరించి బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చిన మహేశ్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన చింతాడ మహేశ్‌బాబు ఇంటర్‌నెట్ సెంటర్ నడుపుతున్నాడు. సెంటర్‌కు వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి లోబరుచుకునేవాడు. మహేశ్ మాయమాటలకు లొంగిపోయిన మహిళలను ప్రలోభాలకు గురిచేసేవాడు. ఈ క్రమంలో ఓ వివాహిత, మరికొందరి యువతుల నగ్న దృశ్యాలను వీడియో తీశాడు. తీసిన వీడియోలను తన కంప్యూటర్‌లో భద్రపరిచాడు. తర్వాత వాటిని స్నేహితులకు షేర్ చేశాడు. యూట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశాడు. అనంతరం స్నేహితుల సహకారంతో బాధిత మహిళలను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. వారి నుంచి రూ.లక్షల్లో డిమాండ్ చేశాడు. షేర్ అయిన వీడియోలు యువకుల సెల్‌ఫోన్లలో హల్‌చల్ చేయడంతో జిల్లాలో కలకలం రేగింది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న మహేశ్‌బాబును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన సీపాన రమేష్, సంతోష్, వెంకటరావులను కూడా అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ బ్రహ్మారెడ్డి తెలిపారు.

More Telugu News