: భారత్ పై విమర్శతో పాకిస్థాన్ నటుడిని తొలగించిన బ్రిటిష్ టీవీ

బ్రిటీష్ టీవీ సిరీస్ నుంచి పాకిస్థాన్ సంతతికి చెందిన నటుడు మార్క్ అన్వర్ (45) ను తొలగించారు. యూరీ ఘటన నేపథ్యంలో మార్క్ అన్వర్ భారతీయులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అన్వర్ చేసిన వివాదాస్పద ట్వీట్స్ ను ‘సండే మిర్రర్’ ప్రచురించింది. పాకిస్థాన్ నటులు భారతదేశంలో పనిచేయడం మానెయ్యాలని అతడు సూచించాడు. అతని ట్వీట్స్ చూసిన ఐటీవీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. అతని ట్వీట్స్ తీవ్ర వివక్షపూరితంగా ఉన్నాయని స్పష్టం చేసింది. అన్వర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అధికారిక ప్రకటనలో స్పష్టం చేసిన ఐటీవీ, ఎంతోకాలంగా ప్రసారం చేస్తున్న ‘కోరోనేషన్ స్ట్రీట్’ కార్యక్రమంలోంచి అతనిని తీసేసింది. కాగా ఈ సీరియల్ లో అన్వర్ 'షరీఫ్ నజీర్'గా నటిస్తున్నాడు. తను చేసిన వ్యాఖ్యలపై బేషరతు క్షమాపణలు చెప్పిన అన్వర్ కాశ్మీర్ లో జరుగుతున్న హత్యలు తనకు బాధ కలిగించాయని పేర్కొన్నాడు. జాతి, మతం ఆధారంగా ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని అన్నాడు.

More Telugu News