: గంటలో నాలా క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.. చేయకపోతే ఇక్కడే బైఠాయిస్తాను: రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌లో వ‌ర్షాల బారి నుంచి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డంలో స‌ర్కారు విఫ‌లం చెందింద‌ని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయ‌న న‌గ‌రంలోని నిజాంపేట బండారి లేఅవుట్‌లో పర్యటించి, ఆ ప్రాంతవాసులు ప‌డుతున్న‌ క‌ష్టాల‌ గురించి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... నాలాల ఆక్రమణలపై తాము ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించ‌డం లేద‌ని అన్నారు. మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే వారు ఎత్త‌డం లేదని ఆరోపించారు. ఇక సామాన్య ప్రజలు ఫిర్యాదులు చేస్తే అధికారులు స్పందిస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. తాను అక్క‌డి నాలా ప‌రిస్థితిపై ఈవోతో మాట్లాడిన‌ట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఈవో నుంచి త‌న‌కు గంటలో నాలా క్లియర్ చేస్తామని హామీ వ‌చ్చింద‌ని చెప్పారు. ఫిర్యాదుపై స్పందించి ఆ పని చేయకపోతే ఇక్కడే బైఠాయిస్తానని పేర్కొన్నారు. బండారి లేఅవుట్ వాసులు ఈ సంద‌ర్భంగా రేవంత్‌రెడ్డికి అధికారులు త‌మ క‌ష్టాల‌పై స్పందించ‌డం లేద‌ని చెప్పారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో చేరిన‌ నీళ్లు తోడాలని ఫిర్యాదు చేస్తే అధికారులు రోజుకు రూ.10 వేలు చెల్లించాల‌ని చెప్పార‌ని వారు అన్నారు.

More Telugu News