: సోష‌ల్‌మీడియాలో పుకార్లు వ్యాపింపజేస్తే క్రిమిన‌ల్ కేసులు: జీహెచ్‌ఎంసీ మేయర్‌

హైదరాబాద్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో సోష‌ల్‌మీడియాలో ప‌లువురు వ్యాపింపజేస్తోన్న పుకార్ల‌పై జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్యాంక్‌బండ్‌కు ప్రమాదం ఉందని, కాప్రా చెరువు తెగుతుందని ప‌లువురు నెటిజ‌న్లు చేస్తోన్న అస‌త్య పోస్టుల‌ని న‌మ్మొద్ద‌ని ఆయ‌న సూచించారు. ఇటువంటి పోస్టులు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్ట‌డానికి వెనుకాడబోమని స్ప‌ష్టం చేశారు. న‌గ‌రంలో లోతట్టు ప్రాంతాల వారు జాగ్ర‌త్త‌గా ఉండాలని మేయర్ సూచించారు. తుర్క‌ చెరువుకు గండిపడే ప్రమాదం ఉన్నందున చెరువు ప‌రిస‌ర ప్రాంతాల్లో నివ‌సిస్తోన్న ప్ర‌జ‌లు అక్క‌డి నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లాల‌ని చెప్పారు. చెరువు ప్రాంతాల్లో చేసిన భ‌వ‌న‌ నిర్మాణాల కారణంగానే ఈ వర్షాలకు సెల్లార్లు కుంగుతున్నాయని ఆయన చెప్పారు. వర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌పోతే పిల్లర్లు సైతం కూలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

More Telugu News