: తన 'వీటో' హక్కుతో సౌదీ అరేబియాను ఆదుకున్న బరాక్ ఒబామా

అమెరికాపై జరిగిన 9/11 దాడుల బాధితులు సౌదీ అరేబియాపై దావా వేసేందుకు అనుమతించే బిల్లును తన విశేషాధికారంతో అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం నాడు అడ్డుకున్నారు. బిల్ పాస్ కాకుండా 'వీటో'ను వినియోగించారు. ఉగ్రదాడి బాధితులపై తనకెంతో సానుభూతి ఉందని, అయితే, అమెరికా జాతి ప్రయోజనాల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. యూఎస్ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించగా, అధ్యక్షుడు అడ్డుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత, ఆయన వీటోను తిరస్కరించేందుకు అటు రిపబ్లికన్, ఇటు డెమోక్రాట్ ప్రజా ప్రతినిధులు మొట్టమొదటిసారి నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఒబామా నిర్ణయం తమకు అసంతృప్తిని కలిగించిందని పలువురు ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించారు. "సౌదీ అరేబియా వాసులు ఏ తప్పూ చేయకుంటే, విచారణకు భయపడ కూడదు. 9/11 దాడుల వెనుక వారి హస్తం ఉంది. వారు నేరస్తులే కాబట్టి బిల్లును అడ్డుకుంటున్నారు" అని ఓ కాంగ్రెస్ మెన్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ దాడిలో 3 వేలకు పైగా మరణించగా, సౌదీ ప్రభుత్వ హస్తం దీని వెనకున్నట్టు అమెరికా అధికారులు పక్కా సాక్షాలు సంపాదించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. విమానాలను హైజాక్ చేసిన 19 మందీ సౌదీ అరేబియా వాసులే కాగా, వారితో తమకు ఎలాంటి సంబంధమూ లేదని సౌదీ ప్రభుత్వం వాదిస్తోంది. తమ ప్రభుత్వంపై కేసు వేస్తే, అమెరికాకు చమురు సరఫరా నిలిపేస్తామని హెచ్చరించింది. దౌత్య పరమైన స్నేహబంధం తెగుతుందన్న ఉద్దేశంతోనే ఒబామా తన వీటో హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News