: ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారం.. నియంత్రణ రేఖ దాటి 20 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత్!

ఉరీ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందా? అవుననే అంటున్నాయి కొన్ని ప్రసార మాధ్యమాలు. ఈ నెల 20, 21వ తేదీల్లో హెలికాప్టర్ ద్వారా భారత బలగాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టి కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. పీవోకేలోని మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 20 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే కచ్చితంగా ఎంతమంది ఉగ్రవాదులు మృతి చెందారన్నది మాత్రం తెలియరాలేదు. ఈ నెల 20న పీవోకేలోని గిల్గిత్, స్కర్దు నగరాలతోపాటు ఖైబర్-ఫంఖ్తుంఖ్వా ప్రావిన్సులోని చిత్రల్ నగరానికి పాకిస్థాన్ ప్రభుత్వం విమానాలను రద్దు చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. పీవోకేలో భారత్ దాడిపై పాక్ ప్రధాని నవాజ్ షరీప్ ఆ దేశ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌తో మంగళవారం చర్చించినట్టు సమాచారం. ఈ ఘటన తర్వాతే షరీఫ్ ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారని తెలుస్తోంది.

More Telugu News